సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి దేశ న్యాయవ్యవస్థపై దాడే
జాతీయ మాల మహానాడు మేడ్చల్ జిల్లా కన్వీనర్ గుజ్జుక పరుశురాం
మేడ్చల్, అక్టోబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజేఐ) జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని జాతీయ మాల మహానాడు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ గుజ్జుక పరుశురాం తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే దేశ న్యాయవ్యవస్థ, భారత రాజ్యాంగంపై దాడి చేసినట్లేనని ఆయన పేర్కొన్నారు.న్యాయవాద వృత్తిలో ఉన్న రాకేష్ కిషోర్ అనే వ్యక్తి సిజేఐ గవాయి పై షూతో దాడి చేయడానికి ప్రయత్నించడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు దేశ ప్రజాస్వామ్య విలువలను, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు.ఈ సంఘటన దేశ దళితుల మనో భావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన న్యాయవాదిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని, న్యాయవృత్తి నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతోన్మాదం పెరిగి కొంతమంది రౌడీలుగా, గుండాలుగా మారి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నార
ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ దాడి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి, హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని గుజ్జుక పరుశురాం డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయమూర్తులకు రక్షణ లేకపోవడం ప్రభుత్వాల వైఫల్యమని పేర్కొన్నారు.దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించి, దళితుల మనోభావాలను కాపాడాలని జాతీయ మాల మహానాడు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ గుజ్జుక పరుశురాం తెలిపారు.


Comments