గిరిజన కోచింగ్ సెంటర్ను వేరేచోటికి తరలించాలి
అధికారులకు వినతిపత్రం అందించిన గిరిజన విద్యార్థి సంఘాలు
హనుమకొండ, తెలంగాణ ముచ్చట్లు:
బాలసముద్రంలో నిర్వహణలో ఉన్న గిరిజన శాఖ కోచింగ్ సెంటర్ను వేరే ప్రదేశానికి తరలించి, అక్కడ ఎస్టీ బాలుర హాస్టల్ను ఏర్పాటు చేయాలని గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు కోచింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ లింగాల శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు అజ్మీర వెంకట్ నాయక్ మాట్లాడుతూ, హనుమకొండ నియోజకవర్గ పరిధిలో ఎస్టీ బాలుర వసతి గృహం లేకపోవడం వల్ల గిరిజన బాలికలు విద్యలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో హనుమకొండలో ఉన్న హాస్టల్ను వర్థన్నపేట నియోజకవర్గంలోని అరెపల్లికి తరలించడంతో సమస్యలు తలెత్తినట్లు చెప్పారు.
అశోకకాలనీ ప్రాంతంలో ఉన్న ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో కోచింగ్ సెంటర్ అభ్యర్థులను రాత్రి పంపడంతో అక్కడి విద్యార్థులకు సరిపడే వసతి లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. కొత్తగా వచ్చే విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని, కాలేజీ హాస్టల్లో నాలుగు గదులను కోచింగ్ అభ్యర్థులు ఉపయోగించడంతో మిగతా విద్యార్థులకు స్థలావకాశం లేకుండా పోతుందన్నారు.
గిరిజన కోచింగ్ సెంటర్ను భట్టుపల్లి లేదా చింతగట్టు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న గిరిజన భవనాల్లో నిర్వహించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి వినతిని అందజేస్తామని నాయకులు తెలిపారు. అలాగే హనుమకొండ నగరంలో ఎస్టీ (బి) హాస్టల్ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో గిరిజన శాఖ మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేను కలవనున్నట్టు తెలిపారు. బాలసముద్రం నుంచి కోచింగ్ సెంటర్ తరలించే వరకు దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోత్ భాస్కర్, డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అజ్మీర వెంకట్, గిరిజన సంఘం & బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి, సేవాలాల్ సేనా సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా సమ్ములాల్ తదితరులు పాల్గొన్నారు.


Comments