పురావస్తు పరిశోధనశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
వరంగల్,అక్టోబర్23(తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ జిల్లా పురావస్తు పరిశోధన మరియు ప్రదర్శనశాలను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న శిలాశాసనాలు, విగ్రహాలు, శిల్పకళా సంపదను ఎంపీ సమీక్షించారు.ఎంపీ మాట్లాడుతూ, వరంగల్ చరిత్ర, కాకతీయుల సంస్కృతి తెలంగాణ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ప్రాంతపు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. జిల్లా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సంరక్షణా కార్యక్రమాల పురోగతిని ఎంపీ ఆరా తీశారు.
పురాతన శిల్పకళా సంపద, కాకతీయ శిలాశాసనాలు తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయని, వీటి సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని డా. కడియం కావ్య తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా పురావస్తు అధికారులు ఎంపీకి వివిధ శిల్ప సంపద, ప్రాచీన నాణేలు, శాసనాల చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి, శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments