నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ యువనాయకులు
బీఆర్ఎస్ యువనాయకులు బొల్లికొండ వీరేందర్,శ్రీధర్,విజయ్ ప్రకాశ్ రెడ్డి, శరత్ చంద్
హనుమకొండ,అక్టోబర్23(తెలంగాణ ముచ్చట్లు):
నమస్తే తెలంగాణ దినపత్రిక కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ యువనాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. సమావేశంలో బీఆర్ఎస్ యువనాయకులు బొల్లికొండ వీరేందర్, శ్రీధర్, విజయ్ ప్రకాశ్ రెడ్డి, శరత్ చంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనుచరులు జరిపిన దాడి ప్రజాస్వామ్య విలువలను అవమానపరచిన చర్య అని పేర్కొన్నారు.
“హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలను నమస్తే తెలంగాణ పత్రిక బహిర్గతం చేయడంతో జీర్ణించుకోలేక దాడులకు పాల్పడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఇలాంటి దుశ్చర్యలను ప్రోత్సహించడం సిగ్గుచేటు. వారి అనుచరులు, కుటుంబ సభ్యులు నగరంలో భూ దందాలు, సెటిల్మెంట్లు, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ అవినీతిని వెలికితీసినందుకే ఈ దాడులు జరగడం బాధాకరం” అని వ్యాఖ్యానించారు.
పత్రికలలో వచ్చిన వార్తలపై అభ్యంతరం ఉంటే ఖండనల రూపంలో స్పందించడం, లేదా ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయడం ప్రజాస్వామ్య పద్ధతి అని, కానీ మీడియాపై బెదిరింపులు, భౌతిక దాడులు చేయడం అంగీకారయోగ్యం కాదని వారు హెచ్చరించారు.“ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియాపై దాడులు చేయడం మంచిపద్ధతి కాదు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ దాడులకు ప్రేరేపించిన వారిని గుర్తించి శిక్షించాలి” అని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పోగుల రమేష్, ఏకు ప్రవీణ్, కంచర్ల యాకయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments