ఏకవీర ఎల్లమ్మ ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య
పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటింపు
వరంగల్, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15వ డివిజన్ మొగిలిచర్లలో ప్రసిద్ధి చెందిన ఏకవీర ఎల్లమ్మ దేవాలయాన్ని వరంగల్ లోక్సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఆలయ నిర్మాణ వైశిష్ట్యం, పురాతన శైలి, శిల్పకళ వంటి అంశాలను పరిశీలించిన ఆమె, ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా మంజూరు చేయించే దిశగా కృషి చేస్తామని డాక్టర్ కావ్య పేర్కొన్నారు. రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని చెప్పారు. ఇందుకోసం ఆలయానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించి గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్ ఏర్పాట్లు చేపట్టే అవకాశం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఆలయ ఆవరణలో గతంలో ఏర్పాటు చేసిన సుమారు 30 శిలా విగ్రహాలకు పీఠాలు ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్తో కలిసి ఆలయంలోని పురాతన రాతిబండలను తొలిచి నిర్మించిన గుహలను, గ్రామం నుండి సేకరించిన శిల్పాలు, శాసనాలు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకుడు అర్జున్ రావు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు బుజ్జి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, పర్యాటక శాఖ అధికారి శివాజీ, టార్చ్అరవింద్ ఆర్యా తదితరులు పాల్గొన్నారు.


Comments