మల్లారం కాలనీకి రోడ్డు ఎప్పుడు..?
ప్రజల సమస్యలపై మళ్లీ గళమెత్తిన పండూరి వీరబాబు.
దమ్మపేట, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట గ్రామంలోని మల్లారం కాలనీ ప్రజలు రోడ్డు కోసం పలుమార్లు విన్నవించినా పరిష్కారం దొరకక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు పండూరి వీరబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం బీఆర్ఎస్ కాలంలో అభివృద్ధి పేరుతో అరవొకరగా, అక్కడక్కడ రోడ్లు వేయించి ప్రచారం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానంతో తమకు అనుకూల ప్రాంతాల్లో మాత్రమే రోడ్లు వేయించుకుంటూ, అవసరం ఉన్న ప్రదేశాలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
ముఖ్యంగా మల్లారం కాలనీలో ప్రజలు ఎప్పటినుంచో రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారని, కానీ నాయకులు మాటలు మాత్రమే ఇచ్చి పనులు వాయిదా వేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. మల్లారం కాలనీ చర్చి రోడ్డు కొంతవరకు ఆగిపోయి నెలలు గడిచినా తిరిగి పనులు ప్రారంభం కాలేదని, అలాగే మల్లారం కోర్టు వెనుక రోడ్డూ పూర్తికాక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాల సమయంలో గుంటలు, మురికితో ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను వీరబాబు ఆవేదనగా వివరించారు.
వెంటనే బీటీ రోడ్ల పనులు పూర్తిచేయాలని, కాలనీ ప్రజల ఆందోళనను ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు గమనించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఓటు రూపంలో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు గంగాధర నాగమణి, సంధ్య, కోలా లక్ష్మి, గొల్లపల్లి రాధా, కొజ్జా దోరగా, శ్రీలం శ్రీను, కాలనీ ప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments