హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫోర్త్ సిటీ
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం పిలుపు
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నదే తమ అభిమతమని సీఎం తెలిపారు.
గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి వారు నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్పూర్తితో తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనుసరిస్తోన్న నూతన విధానాలను, చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి తన సందేశంలో ప్రస్తావించారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఫ్యూచర్ సిటీలో చేపట్టామని, ఇటీవలి తన విదేశీ పర్యటనల్లోనూ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ ఫోర్త్ సిటీపై ఆసక్తి చూపించాయని ముఖ్యమంత్రి తెలిపారు.
వ్యక్తిగత శ్రమ, విధేయత ఒక మనిషిని ఉన్నత స్థానానికి చేరుస్తాయని, నేపథ్యాలు వేరైనప్పటికీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు అలా కష్టపడి పైకి వచ్చినవారే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుచేశారు.
హైదరాబాద్ లో క్షత్రియ భవన్ కు స్థలం కేటాయింపు, అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందని, పేద క్షత్రియులకు కూడా సంక్షేమం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా క్షత్రియ సేవా సమితి వారు ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు గారు, పలువురు ప్రజా ప్రతినిధులు, క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments