పంచాయతీ ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి
-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
పంచాయతీ ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి హైదరాబాద్ నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణ సన్నద్దత పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ఫోటో తో కూడిన ఓటర్ జాబితా రూపకల్పన చేయాలని అన్నారు. ఓటరు జాబితా నుంచి గ్రామ పంచాయతీ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వార్డుల వారీగా కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆయన సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రామంలోని వార్డుల వారీగా అవసరమైన మేర పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని అన్నారు. బ్యాలెట్ బాక్స్ లను తనిఖీ చేసి అవసరమైన మరమ్మత్తులు నిర్వహించాలని, మొదటి దశ బ్యాలెట్ బాక్సుల తరలింపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర సిబ్బందిని గుర్తించి వారి వివరాలు అందజేయాలని, రిటర్నింగ్ అధికారులు, ప్రిసీడింగ్ అధికారులుగా విధులు నిర్వహించే వారికి అవసరమైన శిక్షణ అందించేందుకు వీలుగా ప్రతి జిల్లా నుంచి 10 మంది రిసోర్స్ పర్సన్ ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి శిక్షణకు పంపాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వివిధ దశలలో జరుగుతాయని, దానికి సంబంధించి ముద్రించాల్సిన బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రేస్ మొదలగు అంశాలను ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఆదేశాలు గ్రహించినట్లు, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్పరెన్సులో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, డిఆర్డీవో సన్యాసయ్య, జెడ్పి సిఇఓ దీక్ష రైనా, ఇంచార్జ్ డిపిఓ నాగలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments