పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించాలి
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ సీఈఓ కార్యాలయం నుంచి అదనపు సీఈఓ లోకేష్ కుమార్ తో కలిసి ఓటరు జాబితా సవరణ- 2025 పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జనవరి 1, 2025 ప్రామాణికంగా ఓటర్ జాబితా సవరణ -2025 కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా నమోదు ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రీ రివిజన్ నిర్వహించి అక్టోబర్ 29న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేయాలని, నవంబర్ 28, 2024 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని, రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని, డిసెంబర్ 24, 2024 లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 6, 2025 న తుది ఓటరు జాబితా రూపోందించాలని తెలిపారు. ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18, 2024 వరకు బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల వారిగా ఇంటింటికి తిరుగుతూ, ఓటరు ధృవీకరణ చేపట్టాలని, ఓటరు జాబితాలో అవసరమైన చోట పాత ఫోటోలను తొలగించి ఓటర్ల నూతన ఫోటోలు అప్లోడ్ చేయాలని, జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలని అన్నారు. అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 28 వరకు జనవరి 1, 2025 ప్రామాణికంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ముసాయిదా జాబితాని రూపొందించాలని అన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన ఓటర్ల వివరాలను, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఓటర్ జాబితా నుంచి ఫారం 7 ద్వారా తొలగించాలని అన్నారు. 1500 మంది ఓటర్లకు మించి ఉన్న పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేయాలని, అవసరమైన చోట నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. ఓటర్ జాబితాలో ఉన్న మల్టీ ఎంట్రీలను తొలగించాలని, అదేవిధంగా ఓటర్ కార్డు పై ఉన్న పొరపాట్లు పరిష్కరించాలని కలెక్టర్ లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 79 వేల 822 ఫారం 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సీఈఓ ఆదేశించారు. ఓటరు నమోదుకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం కార్యాచరణ చేసి, ఓటరు జాబితా సవరణ పూర్తి చేస్తామన్నారు. ప్రణాళికాబద్ధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందేలా చర్యలు చేపడతామన్నారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్/వైరా ఆర్వో, నేలకొండపల్లి తహసీల్దార్/ఇఆర్వో ఖాళీల విషయమై సిఇఓ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మండలాల వారిగా దరఖాస్తులను సోమవారం సాయంత్రం లోగా ఆన్లైన్ లో బిఎల్ఓ క్షేత్ర పరిశీలనకు పుష్ చేయాలన్నారు. రోజువారి దరఖాస్తుల పరిష్కార ప్రగతిని సమర్పించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ ఎన్నికల విభాగ డిటి అన్సారీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments