జూబ్లీహిల్స్లో బీజేపీ శక్తి ప్రదర్శన
లంకెల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ
జూబ్లీహిల్స్, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున పోటీ చేస్తున్న లంకెల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ ఘనంగా జరిగింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరై ర్యాలీని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీలు రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఏ పాయల్ శంకర్, ఎంఎల్సీలు మల్కా కొమురయ్య, ఏవిఎన్ రెడ్డి, నేతలు కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ ర్యాలీ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రాంతం బీజేపీ జెండాలతో కాంతులీనింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు “జయభారత్, జయబీజేపీ”, “దీపక్ రెడ్డి విజయం సునిశ్చితం” అంటూ నినాదాలతో ఉత్సాహాన్ని నింపారు.ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ_ “జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞులు. తెలంగాణలో దోపిడీ పాలనకు తెరదించాలంటే, దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. గతంలో కిషన్ రెడ్డిని ఆశీర్వదించిన ప్రజలు, ఈసారి లంకెల దీపక్ రెడ్డిని కూడా గెలిపించాలని కోరుతున్నాను,” అని తెలిపారు.లంకెల దీపక్ రెడ్డి మాట్లాడుతూ – “జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉన్నాను. నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చే 20 రోజుల్లో ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ విజయాన్ని ఖాయం చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ – “జూబ్లీహిల్స్ హైదరాబాద్ గుండె లాంటిది. ఇక్కడి ప్రజలు అభివృద్ధి, పారదర్శకత కోరుకుంటున్నారు. ప్రజల ఆశలను నెరవేర్చగల సామర్థ్యం బీజేపీ ప్రభుత్వానికే ఉంది,” అని పేర్కొన్నారు. నామినేషన్ అనంతరం బీజేపీ నాయకులు ర్యాలీగా ఎన్నికల కార్యాలయానికి చేరుకుని పత్రాలను సమర్పించారు. కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో బీజేపీకి పెరుగుతున్న మద్దతుతో, ఈ ర్యాలీ పార్టీ శక్తిని ప్రతిబింబించిందని అన్నారు.


Comments