ఎల్కతుర్తిలో ఉచిత మెగా వైద్య శిబిరం
ఎల్కతుర్తి,17నవంబర్(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ప్రాంగణంలో జరిగిన ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రారంభి౦చి, ఓపీ, హెల్ప్డెస్క్, ల్యాబ్, ప్రాథమిక పరీక్షల విభాగాలను స్వయంగా పరిశీలించారు. కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రుల సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ శిబిరంలో 38 మంది నిపుణ వైద్యులు, 60 మంది పీజీలు, పారామెడికల్ సిబ్బంది కలిసి వైద్య సేవలు అందించారు.
శిబిరానికి వచ్చిన మొత్తం 762 మందికి వైద్య సేవలు అందించగా, జనరల్ మెడిసిన్లో 292, ఆర్థోలో 127, కంటి విభాగంలో 170, ఈఎన్టీ విభాగంలో 45, చర్మం విభాగంలో 30, పిల్లల విభాగంలో 20, సర్జరీలో 25, స్త్రీరోగాల్లో 27 మంది సేవలు పొందారు. మరింత చికిత్స అవసరమైన 115 మందిని ఎంజీఎం మరియు జీఎంహెచ్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు.
శిబిరంలో 93 మందికి రూ.1.67 లక్షల విలువైన ల్యాబ్ పరీక్షలు, 122 మందికి రూ.16 వేల విలువైన షుగర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం రూ.2 లక్షలకు పైగా విలువైన మందులను పంపిణీ చేశారు. డీఎంహెచ్వో విజ్ఞప్తి మేరకు వరంగల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రూ.15 వేల విలువైన మందులు అందించింది.
గ్రామాల్లో అందుబాటులో ఉండని ప్రత్యేక వైద్య సేవలను ప్రజలకు చేరవేయడమే ఈ శిబిరం ఉద్దేశమని అధికారులు తెలిపారు. గ్రామాల వారీగా ముందస్తు గుర్తింపు చేసి ప్రజలను శిబిరానికి తీసుకువచ్చేందుకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.


Comments