బాలానగర్ పి హెచ్ సి లో ఆశా వర్కర్లకు జీతాలు వేయాలి : సిఐటియు
బాలానగర్, నవంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు అక్టోబర్ నెల జీతాలు వెంటనే చెల్లించాలని, వారిపై జరుగుతున్న వేధింపులను నిలిపివేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేసింది.వివి నగర్ సబ్ సెంటర్లో పనిచేస్తున్న ఏడుగురు ఆశా వర్కర్లకు అక్టోబర్ నెల పారితోషికం “జీరో”గా వేశారని యూనియన్ నేతలు తెలిపారు. పనులు పూర్తిగా చేసినప్పటికీ ఏఎన్సీ టార్గెట్ పూర్తి కాలేదన్న కారణంతో జీతం ఆపివేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు.ఆశా వర్కర్లు మెడికల్ ఆఫీసర్ను ఈ విషయం గురించి అడిగినప్పుడు, “టార్గెట్ పూర్తయితేనే జీతం వేస్తాం, ఒక నెల జీతం రాకపోతేనే మీకు బుద్ధి వస్తుంది” అని సమాధానం ఇచ్చారని వారు వెల్లడించారు.ఈ ఘటనపై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆశా యూనియన్ జిల్లా వైద్యాధికారి (డి ఎం హెచ్ ఓ) మరియు డిపిహెచ్ఎన్ఓకు వినతిపత్రం సమర్పించింది.
జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి మాట్లాడుతూ, “ఆశా వర్కర్లు ప్రభుత్వ మాన్యుయల్ ప్రకారం అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. అయినప్పటికీ, టార్గెట్ పేరుతో జీతం ఆపివేయడం సరికాదు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలి,” అన్నారు.
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ, “ఆశా వర్కర్లతో మాన్యుయల్ లో లేని అనేక పనులు చేయించుకుంటూ చివర్లో జీరో బిల్లులు వేయడం తీవ్ర అన్యాయం. ఏఎన్ఎంలు ఆశాలపై దుర్బాషలు మాట్లాడడం, బెదిరించడం ఆపాలి,” అని హెచ్చరించారు.
సిఐటియు ఆశా యూనియన్ నాయకులు హెచ్చరిస్తూ, “అధికారులు తక్షణం సమస్య పరిష్కరించకపోతే బాలానగర్ పిహెచ్సీ వద్ద ధర్నా నిర్వహించి, అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ముదృతం చేస్తాం,” అని ప్రకటించారు.


Comments