ప్రతి సోమవారం రైతు అన్నదానం
మూడో విడతగా సేవ కార్యక్రమం
మేడ్చల్ మల్కాజిగిరి, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే రైతు అన్నదానం కార్యక్రమం మూడో విడతగా సోమవారం నిర్వహించారు. ప్రజావాణి కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సందర్శకులు ఈ అన్నదానాన్ని వినియోగించి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సమితి అధ్యక్షురాలు ఇంద్రపాల భవాని మాట్లాడుతూ, ప్రజావాణి నిమిత్తం ప్రతి సోమవారం వందలాది మంది కలెక్టర్ కార్యాలయానికి వచ్చే నేపథ్యంలో వారిలో కనీసం కొంతమందికైనా తమ సంస్థ తరఫున భోజనం అందించగలుగుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ప్రభుత్వం ఐదు రూపాయల భోజన పథకాన్ని అమలు చేస్తే మరింత మంది లబ్ధిపొందుతారని అభిప్రాయపడ్డారు. త్వరలో ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.సంస్థ ప్రధాన కార్యదర్శి ఇంద్రపాల సత్యనారాయణ మాట్లాడుతూ, గత మూడు వారాలుగా తమ శక్తి మేరకు రోజుకు వందమంది వరకు అన్నదానం అందిస్తున్నామని చెప్పారు. మరింత మంది దాతలు ముందుకు వస్తే పెద్ద ఎత్తున సేవ చేయగలమని తెలిపారు. దాతలు ఫోన్పే, గూగుల్పే ద్వారా 90320 88236 నెంబర్కు సహకారం అందించవచ్చని తెలిపారు.
మూడో విడత కార్యక్రమానికి జవహర్నగర్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఫారుక్, సామాజిక కార్యకర్త రచన రెడ్డి సహకారం అందించగా, వారికి సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబాల మల్లేష్, ఎండి రహిమాన్, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments