కిష్టారం అభివృద్ధి పనుల తనిఖీ – ద్వారకాపూరి సమస్యలపై స్పందన!
సత్తుపల్లి, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ శుక్రవారం పర్యటించారు. ఉదయం కిష్టారం గ్రామం, మధ్యాహ్నం సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపూరి కాలనీలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.
కిష్టారం ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం, తరగతి గదుల పనులను పరిశీలించిన ఆయన, బీసీ హాస్టల్లో మధ్యాహ్న భోజన వంటను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తోంది, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచి ఉపాధ్యాయులకు ఊరట కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదే, పాఠశాలలు ప్రారంభమైన వెంటనే పుస్తకాలు, యూనిఫామ్లు అందించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్దే అని పేర్కొన్నారు.
తరువాత ఆయన ద్వారకాపూరి కాలనీకి చేరుకుని ప్రజలతో సమావేశమయ్యారు. గత బీఆర్ఎస్ మున్సిపల్ పాలనలో పరిష్కారం కాని సమస్యలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని గుర్తించి, త్వరలోనే పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్ సమస్యపై విద్యుత్ అధికారులతో చర్చించారు, అలాగే డ్రైనేజీ, పరిశుభ్రత, కరెంట్ స్తంభాల సమస్యలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సత్తుపల్లి పట్టణంలో గృహస్థలాలు లేని నిరుపేదలకు ఇళ్లు కల్పించడం, సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా చూడడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన తెలిపారు.
ఈ పర్యటనలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, సిపిఐ సీనియర్ నాయకుడు దండు ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు ఉడతనేని అప్పారావు, నరకుల్ల అప్పారావు, రవికుమార్, గఫార్, మాజీ కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, పట్టణ-గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


Comments