లేబర్ కోడ్ల రద్దుకు పోరాటం : ఐఎన్టీయూసీ.
బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతి కుమార్.
సత్తుపల్లి, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక సత్తుపల్లి పట్టణం సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ సూచనలతో సత్తుపల్లి ఐఎన్టీయూసీ యూనియన్ సమావేశం నిర్వహించారు.
సత్తుపల్లి బ్రాంచ్ కార్యదర్శి తీగల క్రాంతి కుమార్ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలతో పాటు సింగరేణి ఐక్య కార్మిక సంఘాలు మన సింగరేణి సంస్థను, కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి చేసే పోరాటాలు, నిరసన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొని జాక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారని తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడం వల్ల కార్మికులకు అనేక ఇబ్బందులు కలుగుతాయని, ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మిక సంఘాల ఉనికి కోల్పోవడమే కాక కార్మికులు సమ్మె హక్కు కోల్పోవడం, పని గంటల పెంపు, ఉద్యోగ భద్రత కోల్పోవడం తో పాటు అనేక ప్రయోజనాలను కోల్పోతారని చెప్పారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతి కార్మికుడు తన హక్కులను కాపాడుకోవడం కోసం తను పనిచేసే సంస్థను కాపాడుకోవడానికి ముందు వరుసలో ఉండి ఐక్య కార్మిక సంఘాల పిలుపుమేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ బ్రాంచ్ నాయకులు నాగ ప్రకాష్, రామారావు (ఫిట్ సెక్రటరీ, జే.వి.ఆర్ ఓసి), బాలాజీ (ఫిట్ సెక్రటరీ, కిష్టారం ఓసి), పోగుల నాగేశ్వరరావు (ఫిట్ సెక్రటరీ, జే.వి.ఆర్ సి.హెచ్.పీ), అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, వివిధ కమిటీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Comments