పదవి ఒక వరం… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి.
సర్పంచులకు మంత్రి తుమ్మల సూచన.
సత్తుపల్లి, డిసెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల విశ్వాసంతో లభించిన పదవి ఒక వరమని, ఆ నమ్మకానికి అనుగుణంగా పనిచేసినప్పుడే ప్రజల మన్ననలు లభిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గ్రామాల అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్పంచులకు సూచించారు.
సత్తుపల్లి మండల పరిధిలోని పాకలగూడెం గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సర్పంచుల అభినందన కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు, సహాయ సహకారాలు ప్రభుత్వపరంగా పూర్తిగా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండటమే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ప్రజల మన్నన పొందిన నాయకులకే రాజకీయాల్లో సుదీర్ఘ భవిష్యత్తు ఉంటుందని, అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిజాయితీతో పాటు పారదర్శకత తప్పనిసరిగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్తో పాటు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.


Comments