అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలి...
-అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి
జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించిన అదనపు కలెక్టర్
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:
అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా బ్యాంకర్లు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అన్నారు. 2024-25 వార్షిక ఋణ ప్రణాళికలో సెప్టెంబర్ 2024 వరకు 2722.66 కోట్లు స్వల్పకాలిక పంట ఋణాలుగా అందచేయడం జరిగిందని, వ్యవసాయ టర్మ్ ఋణాలుగా వ్యవసాయ రంగానికి 1239.55 కోట్లు బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ ఋణాలను సకాలంలో అందించి లక్ష్యాలను సాధించాలని, రైతులు పంట ఋణాలు సకాలంలో చెల్లించేలా అధికారులు క్షేత్ర స్థాయిలో శ్రద్ధ కనబరచాలని అదనపు కలెక్టర్ తెలిపారు. సూక్ష్మ ఋణాల క్రింద సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు గాను 1216.65 కోట్లు ఇవ్వడం జరిగిoదని, విద్యా ఋణాలుగా 17.53 కోట్లు, గృహ ఋణాలుగా 57.09 కోట్లు అందించడం జరిగిందని ఆయన అన్నారు. ప్రాధాన్యతా రంగాలకు మొత్తంగా 5928.38 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. అప్రధాన్యత రంగాలకు 2265 కోట్లు అందించినట్లు, మొత్తంగా జిల్లాలో 8193.38 కోట్లు సెప్టెంబర్, 2024 మాసము వరకు బ్యాంకుల ద్వారా అందించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు సకాలంలో ఋణాలు అందచేసి లబ్దిదారులకు ప్రయోజనం కల్పించాలని సూచించారు. జిల్లాలో 764 మహిళా సంఘాలకు 2024-25 సంవత్సరానికి రూ. 11074.30 లక్షల బ్యాంక్ లింకేజీ ఋణాలు ఇప్పటి వరకు అందించామన్నారు. అర్హత ఉన్న సంఘాలకు ఋణాలు వెంటనే అందించాలని, రెన్యువల్ లో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా చూడాలని తెలిపారు. పి.ఎం.ఇ.జి.పి., పి.ఎం.ఎఫ్.ఎం.ఇ. ఋణాలు లబ్దిదారులకు సకాలంలో అందించాలని ఆయన సూచించారు. పాడి, మత్స్య పరిశ్రమలకు సంబంధించి లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ ఋణాలు సకాలంలో ఇవ్వాలని తెలిపారు. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు నూరు శాతం ప్రజలకు డిజిటల్ సేవలు అందించేలా కృషి చేయాలని, దీనికి బ్యాంకులు ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, ఆర్బీఐ ఎల్డిఓ సాయి తేజ రెడ్డి, నాబార్డ్ డిపిఎం సుజిత్ కుమార్, యుబిఐ డిజిఎం హనుమంత రెడ్డి, ఎస్బిఐ సిఎం వెంకటేశ్వర రావు, ఎపిజివిబి సిఎం శ్రీహరి, డిసిసిబి సిఇఓ ఎన్ వి. ఆదిత్య, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఇంచార్జ్ ఇడి ఎస్సి కార్పొరేషన్ నవీన్ బాబు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.


Comments