జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం
తెలంగాణ ఉద్యమంలో విలేకరుల త్యాగాలను స్మరించిన మంత్రి
-మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక చేయూత
-శిక్షణా తరగతుల ద్వారా వృత్తి నైపుణ్యం పెంపుదలపై దృష్టి
-ఇళ్ల కేటాయింపు, హెల్త్ కార్డుల కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
-రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)

.jpeg)
హైదరాబాద్,సెప్టెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):
జర్నలిస్టులు సమాజానికి అద్దం పట్టే వృత్తి నిర్వహిస్తున్నారని, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తూ వారధిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో గ్రామీణ విలేకరి నుండి ప్రముఖ జర్నలిస్టుల వరకు అందరూ తమ వృత్తిని పక్కనబెట్టి, ప్రజా ఆకాంక్షల కోసం పోరాడారని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ సేవలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక చేయూత, ఇండ్లు కేటాయించడం, హెల్త్కార్డులు అందించడం వంటి అంశాలను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపొందించడానికి శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయన్నారు.సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సి.హెచ్. ప్రియాంక మాట్లాడుతూ, జర్నలిస్టుల కోసం ఎ.ఐ., సోషల్ మీడియా, భాషా పట్టు వంటి అంశాల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 18 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలతోపాటు, ఐదు సంవత్సరాల వరకు పెన్షన్ మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రమాదాలు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టులకు కూడా ఆర్థిక సహాయం అందించామని వివరించారు. త్వరలో ములుగు జిల్లాలో జర్నలిస్టుల కోసం శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జర్నలిజం వృత్తి ఒత్తిడి వల్ల అకాల మరణాలు, అనారోగ్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, జర్నలిస్టు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments