హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం
ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలిక హత్య
హైదరాబాద్,ఆగస్టు 18(తెలంగాణ ముచ్చట్లు): 

కూకట్పల్లిలో ఘోరం జరిగింది. పన్నెండేళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులు ఆఫీస్లకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న కూతుర్ని అత్యంత పాశవికంగా చంపేసి పరారయ్యారు దుండగులు.
కూకట్పల్లి సంగీత్ నగర్లో ఈ దారుణం జరిగింది. పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో పన్నెండేళ్ల సహస్రాణి ను పొట్టనబెట్టుకున్నారు. హత్య గురించి తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకున్నారు.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. సహస్ర తల్లిదండ్రులు రేణుక, కృష్ణ ప్రైవేట్ ఉద్యోగులు. కొన్నాళ్లుగా కూకట్పల్లిలో నివసిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ నిమిత్తం ఆఫీస్కు వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగిందని తెలిపారు.
కాగా, చిన్నారి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విగతజీవిగా ఉన్న తమ చిన్నారిని చూసి గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఇంట్లో ఒకవేళ తమ కొడుకు కూడా ఉండి ఉంటే అతన్ని కూడా చంపేసేవారేమోనని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా ఉండగా, బాలిక హత్యకు సంబంధించి చిన్నారి తల్లిదండ్రులు బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలికపై ఒక యువకుడు లైంగిక దాడికి యత్నించినట్టు అనుమానిస్తున్నారు. ఎదురు తిరిగిన బాలికను పొడిచి చంపినట్లు సమాచారం. సీసీ ఫుటేజ్లో ఓ యువకుడు ఇంటి నుంచి బయటకి వస్తున్న దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


Comments