సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ఎంపీ ఈటల రాజేందర్
సికింద్రాబాద్, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
కొంపల్లి వైపు, షామీర్పేట్ వైపు రహదారి రద్దీ తగ్గించేందుకు, ప్రజల రాకపోకలు సులభతరం చేయడానికి ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ఇందుకోసం రక్షణ శాఖ మరియు కంటోన్మెంట్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినట్టు వివరించారు.కంటోన్మెంట్ భూముల బదలాయింపుకు బదులుగా వచ్చిన నిధులు కంటోన్మెంట్ బోర్డుకు జమ కావడంలో తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రిని పలుమార్లు కోరడం ద్వారా ఆ నిధులను జమ చేయించామని ఈటల రాజేందర్ తెలిపారు.ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి కంటోన్మెంట్ ప్రాంతాన్ని సుందరమైన “నందనవనం”గా తీర్చిదిద్దాలని ఆయన అధికారులు సూచించారు. మొత్తం రూ.303 కోట్ల రూపాయలతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచించారు.
2051 సంవత్సరానికి అంచనా వేసే జనాభా వృద్ధిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, వరదనీటి నికాసా వంటి అంశాల్లో శాస్త్రీయంగా, ఆధునికంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ సంస్థలతో సమన్వయం చేసుకొని కంటోన్మెంట్లో ఎక్కడా చుక్క నీరు నిలవకుండా, మురుగు వాసన లేకుండా సమగ్ర పారిశుద్ధ్య ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. పనులు వేగంగా పూర్తి చేయగల, నాణ్యతను కాపాడగల కాంట్రాక్టర్లకు మాత్రమే కాంట్రాక్టులు ఇవ్వాలని కోరారు.అలాగే కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడం ద్వారా కంటోన్మెంట్ను ఒక ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దవచ్చని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


Comments