సొంత నిధులతో కెనాల్ క్లీనింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని
పాలకుర్తి,తెలంగాణ ముచ్చట్లు:
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి గ్రామంలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి స్వంత ఖర్చులతో కాలువ శుభ్రపరిచే పనులను ప్రారంభించారు.
గ్రామ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే మంగళవారం వడ్డేకొత్తపల్లి చేరుకుని, కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. వడ్డేకొత్తపల్లి నుంచి చిన్న చెరువు వరకు సాగునీరు చేరకుండా ఉన్న నేపథ్యంలో, మురుగు, మట్టి, చెత్త తొలగించి కాలువను శుభ్రపరిచే చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు హనుమాండ్ల ఝాన్సిరెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందించిన తీరు, ఆమె నాయకత్వానికి అద్దం పట్టే విధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు సేవ చేయడం తమ నైతిక బాధ్యత అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, రైతుల సమస్యలే తన సమస్యలుగా భావిస్తున్నానని, ప్రభుత్వ సహాయం ఆలస్యం అయినా ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కేవలం పదవిని మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా బాధ్యత తీసుకుని ఈ పనులు చేపట్టినట్లు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, శాఖాధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.


Comments