సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సమీక్ష
డిప్యూటీ సీఎం భట్టితో కలిసి మరోసారి ముఖ్యమంత్రి పరిశీలన
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి స్థల పరిశీలన చేశారు.
సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలంగా భావిస్తోన్ భవన ప్రధాన ద్వారం వద్ద సీఎం, డిప్యూటీ సీఎంలు స్వయంగా తిరిగి పరిశీలించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై అధికారులతో నిర్వహించిన సమీక్ష వివరాలను, సచివాలయ ఆవరణలో ఉన్న పరిస్థితులతో బేరీజువేసుకుంటూ సీఎం, డిప్యూటీ సీఎం సమాలోచనలు చేశారు.
రాష్ట్ర అధికారిక కేంద్రమైన సచివాలయ భవనంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలోనే ప్రకటించారు. మంగళవారం రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలో మాట్లాడుతూ, ఈఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు తేదీ కూడా ప్రకటించారు. డిజైన్లు, ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
స్థల పరిశీలనలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే మందుల సామేల్ గారు, సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గారు తదితరులు ఉన్నారు.


Comments