ఖమ్మం జిల్లా కుర్రోడికి అదృష్టం తలుపు తట్టింది
లాటరీలో ఏకంగా 240 కోట్లు
ఖమ్మం బ్యూరో, నవంబర్ 8, తెలంగాణ ముచ్చట్లు;
ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన యువకునికి లాటరీ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా అతను సెలబ్రిటీ అయిపోయాడు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత చదువులు పూర్తి చేసి..ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆ యువకునికి అదృష్టం లాటరీ రూపంలో వరించింది.తన తల్లి పుట్టిన తేదీ 11 సంఖ్యతో లాటరీ టికెట్ కొన్నాడు.ఆ అదృష్ట సంఖ్య 11 అతని జీవితాన్నే మార్చేసింది.ఏకంగా 240 కోట్ల రూపాయలు లాటరీ తగిలింది.ఏది ఏమైనా అదృష్టం అంటే ఇలా ఉండాలి అని ఆ ఊరి జనాలు చెప్పుకుంటున్నారు. తమ ఊరి వాడికి అబుదాబిలో 240 కోట్లు లాటరీ తగిలిందంటే.. మామూలు అదృష్టం కాదని.. తమకు గర్వంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామం పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది భీమవరం గ్రామానికి చెందిన గొల్ల అనిల్ కుమార్ అనే యువకుడు అబుదాబి దేశంలో ఏడాదిన్నరగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అక్కడ తన స్నేహితుల సూచనల మేరకు లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.తన తల్లి భూలక్ష్మి పుట్టిన తేదీ 11వ తేదీ కావడంతో.. దాన్నే లక్కీ నంబర్గా భావించి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.ఆ సంఖ్య అతనికి కలిసొచ్చింది. ఏకంగా అదృష్టం కలిసి వచ్చి 240 కోట్ల లాటరీ తగిలింది.తన కుమారుడికి లాటరీ టికెట్ ద్వారా కోట్ల రూపాయలు వచ్చాయంటే తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. ఆ దేవుడే తమకు ఈ మేలు చేశాడని ఆనందపడుతున్నారు.


Comments